పరీక్షలకు ప్లానింగ్ తప్పనిసరి
పరీక్షలకు ప్లానింగ్ తప్పనిసరి
పిల్లలకు ఫిబ్రవరి నుండే పరీక్షల భయం పట్టుకుంటుంది. పరీక్షలు వస్తున్నాయనగానే మనసులో టెన్షన్ మొదలవుతుంది. అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రుల్లోనూ పరీక్షలనేవి ఎల్లప్పుడూ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయమే పరీక్షలు. భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలలో విజయం సాధించడం చాలా సులభం.
పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల వలే పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా… తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలు నేరవేర్చుగలుగుతానా…సరైన సమాధానాలు రాయగలుగుతానా…ఆశించిన మార్కులు రాకపోతే పరిస్థితి ఏమిటి? బంధువులు, స్నేహితుల, ఉపాధ్యాయుల వద్ద పాఠశాలలో తోటి వారి వద్ద పరిస్థితి ఎలా ఉండబోతోంది…ఇలాంటి ఆందోళన వారి మెదళ్లలో మెదులుతుంటుంది. ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు పక్కన పెట్టి పరీక్ష రాయండి విజయం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలుస్తుంది. పరీక్షల భయాన్ని తగ్గించుకోవడం విద్యార్థుల చేతిలోనే ఉంటుంది.
లక్ష్యం (గోల్): పరీక్షలకు ప్రిపేర్ అయ్యేకంటే ముందే లక్ష్యంను ఏర్పాటు చేసుకోవడం వల్ల చదవాలనే కోరిక బలంగా ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్లు పూర్తి చేస్తామో అని ముందే అనుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టడం వలన చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్లోని చాప్టర్లు పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే అనుకున్న టార్గెట్ను పూర్తి చేయగలుగుతాం.
ప్రణాళిక (ప్లానింగ్): విద్యార్థులు ఖచ్చితంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఏ రోజు ఏం చదవాలి? ఎంతమేరకు చదవాలి అని నిర్దేశించుకోవాలి. విద్యాసంవత్సరం మొదటి నుండి బాగా చదివే వాళ్ళు కొందరైతే మరికొంత మంది పరీక్షలు మొదలయ్యే సమయానికి చదవడం ప్రారంభిస్తారు. దీనితో టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి ముందుగానే ప్రణాళిక ఉంటే పరీక్ష సమయానికి ఉల్లాసంగా ఉండవచ్చు. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ చాప్టర్లు పూర్తి చేయాలి అని ప్లాన్ చేసుకుని చదవాలి. ప్లానింగ్ను ఒక పేపర్పైన రాసుకుని చదివే రూంలో మనకు కనపడే విధంగా గోడకు అంటించుకోవాలి.
సమయపాలన: (టైం మేనేజ్మెంట్): మనకు రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగపర్చుకోవాలి. ఏ సమయానికి ఏది పూర్తి చేయాలో ఆ సమయానికి అది పూర్తి చేసుకోవాలి. అలాగని రాత్రంతా మేలుకొని చదవడం వల్ల ప్రయోజనం కనిపించదు. ఉదయం 4.30 నుండి 6 గంటల సమయంలో మన మెదడు చాలా చురుగ్గా పనిచేసే అవకాశం ఎక్కువ.
ఆత్మవిశ్వాసం (సెల్ఫ్కాన్ఫిడెన్స్): పరీక్షల్లో మీ సిలబస్లో ఉన్న వాటి నుండి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఏ ప్రశ్నలు వస్తాయో అని భయపడుతూ వెళితే మీరు చదివింది అంతా కూడా గుర్తుకు రాకుండాపోతుంది. పరీక్షకు వెళ్లేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలి.
పరీక్షల భయం (ఎగ్జామ్ ఫియర్): భయాలు ఎవరికీ పుట్టుకతో రావు పరిస్థితులను మనకు మనంగా సృష్టించుకొని భయపడటం అలవాటుగా చేసుకున్నాం అని గుర్తుంచుకోవాలి. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి. సిలబస్ మననం చేసుకుంటూ పాత ప్రశ్నాపత్రాలు ఏమైనా ఉంటే తరచూ వాటికి సమాధానాలు రాస్తూ ఉంటాలి. దీనివల్ల ‘పరీక్ష ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం’ అనే భావన మీలో తప్పకుండా కలుగుతుంది. చాలా మంది చదువుతారు కానీ రాయడం అలవాటు చేసుకోకపోవడం వల్ల పరీక్షల్లో వేగంగా రాయడానికి ఇబ్బందిపడతారు. ఇంకొంత మంది బాగా చదివే ఇతరులతో పోల్చుకుని కృంగిపోతారు. అలా కృంగిపోకుండా ‘‘అందరూ పుట్టుకతో మేథావులు కారు’’ అనే విషయాన్ని మననం చేసుకుని చదవాలి.
మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, అసూయపడరాదు: ప్రపంచంలో ప్రతిఒక్కరూ ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మన నైపుణ్యాలను మనకు మనంగా ఎల్లప్పుడూ మనలను ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఇతరులను గమనించినప్పుడు అసూయపడకుండా మన మనసుకు తగిన సూచనలను జారీ చేస్తూ ఉండాలి. మనలో ఉన్న ప్రత్యేకతలను మనం గుర్తించేలా ఉండాలి. ఇతరులను గమనించినప్పుడు మనలో ఉన్న సామర్థ్యాలను ఏ విధంగా మెరుగుపర్చుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని దృఢపర్చుకోవాలి.
ఆరోగ్యకరమైన నిద్ర: విద్యార్థులు పరీక్ష రేపు అనగా రాత్రంగా మెళకువతో ఉండి మరీ చదవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఒత్తిడికి గురవుతారు. నిద్రకు ఖచ్చితంగా 6 గంటల సమయాన్ని కేటాయించండి.
అనవసర భయాలు వీడాలి: విద్యార్థులు పరీక్ష మొదలయ్యే సమయానికి కూడా పరీక్ష కేంద్రానికి చేరలేక ఒత్తిడికి లోనవుతారు. పరీక్ష సమయానికి కంటే 45 నిమిషాలు ముందుగానే చేరుకోవడం వల్ల రిలాక్స్గా ఉంటుంది. పరీక్షహాలులో అడుగుపెట్టగానే ‘‘ఏ ప్రశ్నలు వస్తాయో, నేను చదివినవి వస్తాయో లేదో’’ అనే అనవసరమైన భయాలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి వల్ల కష్టపడి చదివినదంతా మరిచిపోయే ప్రమాదం ఉంది. అనవసర భయాలు దరి చేరనివ్వకండి.
